ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో కిశోరి వికాస కార్యక్రమంపై ప్రాంతీయ స్థాయి వర్క్షాప్ ఘనంగా జరిగింది. ఇరిగేషన్ కాంపౌండ్లోని ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మహిళాభివృద్ధి & శిశు సంక్షేమశాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సీడీపీఓలు, అలాగే ఆరోగ్యం, సెర్ప్, మెప్మా, విద్య, పంచాయతీరాజ్ శాఖల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.ఈ వర్క్షాప్కు ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన బేగం అధ్యక్షత వహించారు. కిశోరి వికాసం వేసవి కార్యక్రమాలను మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.కౌమార దశలో ఉన్న బాలికలలో అవగాహన పెంపొందించడం, వారి సమగ్ర అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బాలికల సాధికారితకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా సెర్ప్ అధికారి హరినాథ్ మాట్లాడుతూ, కౌమార దశలో సరైన మార్గదర్శకత్వం, ఆరోగ్య అవగాహన, విద్య, నైపుణ్యాల అభివృద్ధి చాలా ముఖ్యమని చెప్పారు. ఈ దశలో బాలికలకు సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు.జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి బాను నాయక్ మాట్లాడుతూ, యువతలో అవగాహన లోపం వల్ల హెచ్ఐవి/ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిశోరి వికాస కార్యక్రమాల్లో ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు.ఈ వర్క్షాప్ ద్వారా బాలికల అభివృద్ధి కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
