ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అమీర్పేట్లోని ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో బాండెడ్ లేబర్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అవగాహన పెరుగుతోందన్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ఈ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా అదనపు పని చేయిస్తే చట్టప్రకారం అదనపు వేతనం ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని, దీని ద్వారా వారికి రక్షణ కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. 2021 నుంచి 2025 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వందలాది బానిస కార్మికులను రక్షించామని తెలిపారు. వీరిలో మహిళలు, పురుషులు, చిన్నారులు ఉండగా, వ్యవసాయం, ఇటుకభట్టీలు, గృహ సేవలు వంటి పలు రంగాల్లో వారు చిక్కుకున్నట్లు వెల్లడించారు. మానవ అక్రమ రవాణా బాధితులకు సహాయం అందించేందుకు 24 గంటల టోల్ఫ్రీ హెల్ప్లైన్ను ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. అవసరమైతే బాధితులకు గృహ వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తోందని, సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. బానిస కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన చెందే వరకు చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
