ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.ఆదివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో కట్టనార్పట్టి ప్రాంతంలోని ప్రైవేటు బాణసంచా కర్మాగారంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కొన్ని సెకన్లలోనే నాలుగు భవనాలు కూలిపోయాయి. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విరుదునగర్ ప్రాంతంలో బాణసంచా పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
