ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల సేవలు పేదల ఆకలి తీర్చే ‘అమ్మ వంటిల్లు’లా ఉన్నాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తక్కువ ధరలో పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందిస్తూ లక్షలాది మందికి ఉపయోగపడుతున్న ఈ పథకాన్ని ఆమె ప్రశంసించారు.రూ.5లకే గౌరవప్రదంగా భోజనం అందించడం గొప్ప కార్యక్రమమని, రోజువారీ కూలీలు, పేద ప్రజలు ఈ సేవల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని ఆమె తెలిపారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తోందని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ చెక్కును సంబంధిత అధికారులకు అందించారు.ఏప్రిల్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పూర్తిగా ఉచితంగా భోజనం అందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పేదలకు సేవ చేసే అవకాశం దక్కడం తనకు సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు.ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలకు అందరూ సహకరించాలని, పౌష్టికాహారం అందిస్తూ సమాజానికి మేలు చేసే ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
