ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును జాగృతిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి పార్టీ తరఫున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నాయకులు కొత్త రాజకీయ వేదిక వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తలు మళ్లీ ఒకటై రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాను నిర్వహించిన హెల్త్ క్యాంపులను గుర్తుచేసుకుంటూ, రాథోడ్ బాపురావు ఉద్యమానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. కొత్త పార్టీకి ఆదిలాబాద్ ప్రాంతంలో మంచి స్పందన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లో పనిచేశానన్నారు. కవిత ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తరువాత ప్రాధాన్యం దక్కలేదని చెప్పారు.ఇకపై కవిత నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని, త్వరలో ఇచ్చోడలో భారీ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని వెల్లడించారు.
