అమరావతి/తమిళనాడు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ అంశాలపై విపక్షాల వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా విపక్షాలు ఏమి సాధించాయని ఆయన ప్రశ్నించారు.2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి మద్దతు ఇచ్చిన వారు, అమలు దశలో ఇప్పుడు అడ్డుకోవడం సరైనది కాదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే వాదనపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం ఉత్తమ పరిష్కారమని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అమలుకు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
