హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను కట్టడి చేయాలని ఆయన కోరారు.బీజేపీ ఎంపీ తేజస్వీ ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ అడ్డుపడుతోందని జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉన్నాయని అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సౌహార్దాన్ని కాపాడేలా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
