అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర అభివృద్ధికి నైపుణ్య వికాసం కీలకమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం సమగ్ర నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.జనాభా స్థిరీకరణ లక్ష్యంగా తీసుకువచ్చిన కొత్త విధానంలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా అన్ని వయస్సుల వారికి నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు ప్రజల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ఉన్న అవసరాలను గుర్తించి, ఆ మేరకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.2035 నాటికి 95 శాతం ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత కల్పించడం, 75 శాతం మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందిన వారిలో 80 శాతం మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.అలాగే శిశు సంరక్షణ, వృద్ధుల సేవల కోసం లక్ష మందికి సర్టిఫికేట్ కోర్సులు అందించడంతో పాటు, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 25 శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
