జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రైతు భరోసా పథకం కింద భారీ మొత్తంలో నిధులను విడుదల చేసి 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నస్తూర్పల్లి గ్రామంలో జరిగిన రైతు ఉత్సవాల్లో నిర్వహించబడింది. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొని రైతులతో నేరుగా మమేకమయ్యారు. అనంతరం జరిగిన సభలో బటన్ నొక్కి రూ.2,200 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.5,700 కోట్లను రైతులకు అందించినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రైతులే దేశానికి వెన్నెముక. వారి ఆర్థిక స్థితి మెరుగుపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.రుణమాఫీపై మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయం లాభదాయకంగా మారాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు నీటి, మార్కెటింగ్, మద్దతు ధరల సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. “వ్యవసాయం పండుగలా మారాలి” అన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.ఈ కార్యక్రమంలో పలు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, రైతులు ప్రభుత్వ చర్యలపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు.







