భూముల రీ-సర్వే: ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల
ఫైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం, రోజుకు 20 ఎకరాలు సర్వే
అమరావతి, డిసెంబర్ 19, 2024:
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించిన ప్రభుత్వం, భూముల రీ-సర్వేలో గతంలో జరిగిన లోపాలు, ఫిర్యాదుల నేపథ్యంలో తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సులతో పాటుగా, ప్రభుత్వం మండలాల స్థాయిలో ఫైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, 200 నుంచి 250 ఎకరాల విస్తీర్ణంలో భూముల రీ-సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇందులో ప్రతి రోజూ 20 ఎకరాలను సర్వే చేసి, మొత్తం రీ-సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సర్వేకు సంబంధించి ప్రత్యేకంగా వివిధ టీమ్లను ఏర్పాటు చేస్తూ, గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పోరంబోకు భూములు మొదలైన వాటిని ముందుగా సర్వే చేయాలని నిర్ణయించారు. సర్వే సమయంలో సరిహద్దు రాళ్లను నాటాల్సి ఉంటుంది.
సర్వే బృందం :
- సర్వే టీములో 2 విలేజ్ సర్వేయర్లు, 1 విలేజ్ రెవెన్యూ అధికారి, 1 గ్రామ రెవెన్యూ సహాయకుడు సభ్యులుగా ఉంటారు.
- మొత్తం 4 టీమ్లను నియమించి, ఒక టీమ్ భూ యజమానులకు, ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని అందించడంలో ఉపయోగపడుతుంది.
- ప్రగతిరిపోర్టును సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ నియమించబడుతుంది.
మార్గదర్శకాలు:
- సర్వే బృందాలు ముందుగా భూ యజమానులకు, వాటా దారులకు నోటీసులు ఇవ్వాలి.
- వాట్సాప్ గ్రూప్ ద్వారా భూ యజమానులకు సమాచారం అందించాలి.
- ప్రతి గ్రామానికి 4 సర్వే బృందాలను ఏర్పాటు చేయాలి.
- సర్వే ప్రారంభానికి ముందు గ్రామ సచివాలయం పరిధిలో దండోరా వేయించాలి.
- రీ-సర్వే జరగబోయే సమయం గురించి వ్యక్తిగతంగా, రిజిస్టర్ పోస్టు, ఇంటి తలుపుపై నోటీసులు అతికించడం లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాలి.
