హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల అంశంపై బహిరంగ వేదికపై చర్చించేందుకు సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. అందులో గత రెండేళ్లలోనే రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ఆయన సవాల్ విసురుతూ, ఎప్పుడు, ఎక్కడైనా చర్చకు రావాలని కోరారు. ప్రజల ముందు నిజాలు వెల్లడించాలని సూచించారు.బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, అది కేవలం కాళేశ్వరం కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాల కోసమేనని స్పష్టం చేశారు. బీజేపీతో ఎలాంటి రహస్య చర్చలు జరగలేదని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కేవలం కొన్ని బ్యారేజీల లోపాలపైనే కాకుండా మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, అవసరమైతే సీబీఐ విచారణకు అప్పగించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర నిధులు, ప్రాజెక్టుల పారదర్శకతపై చర్చ మళ్లీ వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
