కడప, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక భారీ స్థాయి భూవివాదాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన భూముల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.ఈ కేసులో స్థానిక రాజకీయ నాయకుడి పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్నట్లు సమాచారం. సేకరించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఆయనపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. వారి ద్వారా బయటపడుతున్న వివరాలు కేసును మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.ప్రధాన అనుమానితుడు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.హత్య అనంతరం నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున భూములకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 145 డాక్యుమెంట్లు లభించగా, వాటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇవి కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
