ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవడంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తో జరిగిన చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో సమ్మె తప్పదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.ఏప్రిల్ 22 ఉదయం నుంచే కార్మికులు విధులను బహిష్కరించనున్నట్లు సమాచారం. దాదాపు 10 వేల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ సమ్మెతో వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ప్రయాణించే మహిళలు కూడా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కార్మికులు వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి పలు డిమాండ్లను ముందుంచుతున్నారు. ఇదిలా ఉండగా, సమ్మెపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ బస్సులు ఆగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
