ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, అవగాహన కోసం ప్రత్యేకంగా “ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోండుగూడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మంది ఆదివాసీలు ఐదు బస్సుల్లో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ పర్యటనలో వారు నగరంలోని ముఖ్యమైన పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. నగర జీవన విధానం, అభివృద్ధి, సాంకేతికతను దగ్గరగా తెలుసుకునే అవకాశం కల్పించడమే ఈ యాత్ర లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.ఈ పర్యటనలో చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బారాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రదేశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ఆధునిక సౌకర్యాలను కూడా పరిచయం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో విడతలో 200 నుంచి 250 మంది వరకు ఆదివాసీలు పాల్గొననున్నారు. ఆదివాసీలకు నగర జీవనంపై అవగాహన కల్పించడం, వారి దృష్టిని విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
