ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాలను బయటపెట్టిందని ఆయన ఆరోపించారు.పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ముందుగా చెప్పినట్లుగానే ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఇప్పుడు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రాజెక్టులో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న భాగాలను త్వరగా మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని కేటీఆర్ హితవు పలికారు.
