ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక భూమిక పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నక్సలిజం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ సీఆర్పీఎఫ్ జవాన్లు చూపుతున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయం అన్నారు.హర్యానాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో నిర్వహించిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులర్పించి, పరేడ్ను పరిశీలించారు.52 వారాల కఠిన శిక్షణ అనంతరం విధులకు సిద్ధమైన యువ అధికారుల నిబద్ధత దేశానికి గర్వకారణమని బండి సంజయ్ అన్నారు. దేశసేవ అనే పవిత్ర లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. దేశానికి సేవ చేయడం కంటే గొప్ప బాధ్యత మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారుసీఆర్పీఎఫ్ దేశంలో అతిపెద్ద సాయుధ పోలీస్ దళంగా నిలిచి, అంతర్గత భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. 1939లో స్థాపించబడిన ఈ దళం అప్పటి నుంచి నిరంతరం సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని తెలిపారు.‘సేవ, నిష్ఠ’ అనే ఆదర్శంతో పనిచేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు భవిష్యత్తులో కూడా దేశ భద్రత కోసం మరింత సమర్థంగా సేవలందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
