ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి సీతక్క కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆమె కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.సమ్మె సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్న సీతక్క, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ క్రమంలో కార్మికులు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించనుందని వెల్లడించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లైన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై అన్ని వర్గాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఇది కాలయాపన కాదని, సమగ్ర పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలేనని సీతక్క స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా, ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను క్లియర్ చేయడంతో పాటు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా తగ్గించినట్లు వివరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెను విరమించాలని మంత్రి సీతక్క మరోసారి విజ్ఞప్తి చేశారు.
