ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో తెలంగాణ హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకుని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడం అనవసరమని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ, కొంతమందికి నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాన్ని మాత్రమే హైకోర్టు ప్రస్తావించిందని చెప్పారు. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికను లేదా విజిలెన్స్ విచారణను ఎక్కడా తిరస్కరించలేదని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అయిందని, నిర్మాణ లోపాలు మరియు అవినీతి కారణంగానే ప్రాజెక్టు దెబ్బతిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అవసరం ఉందని, హైకోర్టు తీర్పు దానికి అడ్డంకి కాదని తెలిపారు.కేంద్ర నాయకులు అమిత్ షా, జె. పి. నడ్డా గతంలో చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా అన్న విషయంపై నిజాలు బయటపెట్టాలని కోరారు.ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా నిర్మాణ లోపాలు ఉన్నట్లు వెల్లడైందని, ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే దెబ్బతినడం గమనార్హమని పేర్కొన్నారు. చివరికి ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందేనని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
