పులివెందుల, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న జగన్, గ్రామ శివార్లలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.తరువాత ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, కుటుంబానికి ధైర్యం చెప్పారు.అలాగే పుల్లారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల వివాహం చేసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి, అమృత రెడ్డి దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.జగన్ పర్యటనలో భాగంగా పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి ఆయనను కలుసుకున్నారు.పర్యటన మొత్తం ప్రజలతో ఆప్యాయంగా మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, భరోసా ఇస్తూ సాగింది. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
