హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కుదిరిన అవగాహనా ఒప్పందాలు త్వరగా అమలులోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తక్షణమే తమ కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుల్లో కుదిరిన ఒప్పందాల పురోగతిపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను మూడు వర్గాలుగా విభజించి, ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన కంపెనీలు, ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అధికారులు వివరాలు సమర్పించారు.కంపెనీలకు కేటాయించాల్సిన భూముల విషయంలో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు.డేటా సెంటర్లకు అవసరమైన నీటిని శుద్ధి చేసిన మురుగునీటి ద్వారా వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, అక్కడే పెట్టుబడుల అమలుపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.అవగాహనా ఒప్పందాల అమలుపై పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా ప్రత్యేక డ్యాష్బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్టుబడుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించాలని పేర్కొన్నారు.టైర్-2, టైర్-3 నగరాల్లో ఐటీ టవర్ల కార్యకలాపాలపై కూడా సమీక్షిస్తూ, వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి చేపట్టనున్న పనులపై కూడా సీఎం దిశానిర్దేశం చేశారు.
