ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి రాజకీయంగా వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.హైదరాబాద్లో మాట్లాడిన ఆయన, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అన్నారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. గతంలో పీఆర్సీ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి వైఖరిలో పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కార్మికులకు అండగా ఉంటారని తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీజేపీ తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.
