ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): చిత్తూరు జిల్లా నగరిలో సీపీఐ నేత నారాయణ డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల స్థానాల సంఖ్య పెరిగినా, అభివృద్ధి క్షీణించే ప్రమాదం ఉందని అన్నారు.రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉన్న ఈ అంశాన్ని సీనియర్ నాయకులు సరిగా అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం దక్షిణ భారతానికి నష్టం కలిగించే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకత్వం దక్షిణాదిలో విజయం సాధించడం కష్టమని భావించి, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ముందుకు తెస్తోందని నారాయణ ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మెజారిటీ సాధించి పార్లమెంట్లో తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విధానాలకు కొందరు రాష్ట్ర నాయకులు మద్దతు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
