ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై గతంలో ఎన్నో ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊరట కలిగించింది కోర్టు కాదని, రాష్ట్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం లేకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా మాట్లాడుతూ, రెండేళ్ల పాటు ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ పాత విషయాలనే ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా చెబుతున్న విషయాలను ఆయన ఎప్పుడూ నిరూపించలేకపోయారని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా స్పందించిన కిషన్ రెడ్డి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకే ప్రభుత్వ ఉత్తర్వుతో వారి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
