ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని, భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో కీలక పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతుందని అన్నారు.రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే పలు పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని, ఉత్తరాంధ్రలో ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయని వెల్లడించారు.ఇకపై ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, రాష్ట్రంలోనే అవకాశాలు కల్పిస్తామని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గోదావరి నీటిని తీసుకురావడంపై చర్యలు తీసుకుంటున్నామని, ఏడాది లోపే ఈ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయాన్ని జులైలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఇక గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అప్పటి పాలనలో అవినీతి పెరిగిందని, విద్యుత్ రంగం దెబ్బతిన్నదని ఆరోపించారు. పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
