ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపార పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన స్వీకరించనున్నారు. ముంబైలో నిర్వహించనున్న 26వ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో చంద్రబాబును ‘గెస్ట్ ఆఫ్ హానర్’గా ఆహ్వానించడం విశేషం. పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధికి అందించిన ప్రోత్సాహం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఆయనకు లభించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి.ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం పలువురు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.ఈ అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలు జాతీయ స్థాయిలో ప్రతిఫలిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
