హైదరాబాద్, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై స్పందిస్తూ, ఈ విషాద ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.మీడియాతో మాట్లాడిన దయాకర్, ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే, మరోవైపు బీజేపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా బండి సంజయ్ తన బాధ్యతను మరిచి కార్మికులను ఆందోళనకు దారితీసేలా మాట్లాడుతున్నారని అన్నారు.శంకర్ గౌడ్ మృతి బాధాకరమని పేర్కొన్న ఆయన, ఆ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని, త్వరలోనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు రాజకీయ లాభం కోసం ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ఆరోపించారు. కార్మికులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసిన దయాకర్, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
