విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నాయకత్వంలో రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శైలజ మాట్లాడుతూ, ట్రాఫికింగ్ అనేది ఒకే రకమైన నేరం కాకుండా అనేక రూపాల్లో జరుగుతోందని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యువతను లక్ష్యంగా చేసుకుని ముఠాలు పనిచేస్తున్నాయని హెచ్చరించారు. విదేశాలకు ఉద్యోగాలు లేదా చదువు పేరుతో ఆకర్షించి, చివరకు సైబర్ నేరాల్లోకి దింపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసి, విదేశాలకు తీసుకెళ్లి మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది కొత్త తరహా ట్రాఫికింగ్ విధానమని, దీనిపై యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫికింగ్ బాధితులను గుర్తించడం మాత్రమే కాకుండా, వారికి మానసికంగా సహాయం చేయడం కూడా చాలా ముఖ్యమని శైలజ చెప్పారు. బాధితులు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారని, వారికి సరైన కౌన్సెలింగ్ అవసరమని సూచించారు.అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనుమానితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విధానం భవిష్యత్తులో ట్రాఫికింగ్ నియంత్రణలో కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.ప్రజలు కూడా బాధ్యత తీసుకుని అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి నేరాలను తగ్గించవచ్చని శైలజ స్పష్టం చేశారు.
