ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్లో నిర్వహించిన సభలో ఆమె పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)” అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.పార్టీ ప్రకటనతో సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కవితకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశంపై చర్చ మొదలైంది.ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. అదే పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
