ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూసివేయడం నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలగకుండా సీఎస్, సివిల్ సప్లైస్ అధికారులను అప్రమత్తం చేస్తూ, బంకుల యజమానులు మరియు ఆయిల్ కంపెనీలతో వెంటనే చర్చలు జరపాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇటీవల పలు జిల్లాల్లో ప్రైవేట్ పెట్రోల్ బంకులు మూసివేయడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
