ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపి, వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించినట్లు వెల్లడించారు.జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మికుల చిరకాల ఆశగా ఉండగా, దాన్ని తమ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. 11 శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి నిర్ణయాలతో కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం గంటల తరబడి చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపిందని, మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వ కాలంలో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించిన మంత్రి, తమ ప్రభుత్వం కార్మికులను కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని అన్నారు. సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ సేవలు రోజుకు లక్షలాది మంది ప్రజలకు కీలకంగా మారాయని, పేదలకు ఇది జీవనాధారంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
