ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత చర్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ప్రారంభించడంపై స్పందిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ప్రజల కోసం పోరాటం చేసి ఉంటే మరింత విశ్వాసం పొందేదని వ్యాఖ్యానించారు.కేసీఆర్ పాలనలో రాష్ట్ర వనరులు దుర్వినియోగం అయ్యాయని, నీళ్లు–నిధులు–నియామకాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం సమంజసం కాదని అన్నారు.కవిత సీఎం కావాలనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చారని, అయితే ప్రజలు నిజాన్ని గుర్తిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని, కానీ విమర్శలతో మాత్రమే ముందుకు రావడం సరైంది కాదని సూచించారు.
