హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి, పలు గ్రామాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, భూసంబంధిత సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా ప్రజలు ప్రస్తావించారని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ముందుగా పాలేరు నియోజకవర్గంలో మోడల్గా అమలు చేసి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించవచ్చని, మరికొన్ని సమస్యలకు కొంత సమయం పట్టినా వాటిని నిర్లక్ష్యం చేయబోమని చెప్పారు.ప్రజల విశ్వాసాన్ని పొందడం, ప్రభుత్వంపై నమ్మకం పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, వారి సమస్యలను సమానంగా పరిగణించి పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
