హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): నగర రవాణాలో కీలకమైన మెట్రో రైలు సేవలు ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఎల్అండ్టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (MRHL) నిర్వహణలో ఉన్న మెట్రోను ఈ నెల 30న ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకోనుంది. మే 1 నుంచి మెట్రో సేవలు ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. మెట్రో నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును మెట్రో చైర్మన్గా నియమించింది. సర్పరాజ్ అహ్మద్ను ఎండీగా కొనసాగిస్తూ, జయేష్ రంజన్, వికాస్రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్లను డైరెక్టర్లుగా నియమించింది. మెట్రో టేకోవర్ కోసం సుమారు రూ.15 వేల కోట్ల ఆర్థిక వ్యవహారం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.13 వేల కోట్ల రుణం, రూ.2 వేల కోట్ల ఈక్విటీ భాగంగా ఉన్నాయి. ఈ మొత్తాన్ని IRFC ద్వారా రుణంగా సమీకరించి, 20 ఏళ్లలో తిరిగి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు.ఇప్పటికే రుణానికి సంబంధించి IRFC గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, కేబినెట్ కూడా అంగీకారం తెలిపింది. మే నుంచి జూన్ వరకు కమర్షియల్ పేపర్లపై వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. అలాగే ఎల్అండ్టీకి ఇచ్చిన రూ.900 కోట్ల వడ్డీలేని రుణాన్ని మొత్తం డీల్ నుంచి మినహాయించాలని సూచనలు వచ్చాయి.మెట్రో నిర్వహణ సజావుగా సాగేందుకు మొదటి ఏడాది పాటు నిపుణుల మార్గదర్శకత్వంలో పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే ఎల్అండ్టీ, MRHLకు చెందిన కొంతమంది సిబ్బందిని కొనసాగించనున్నారు.ఈ టేకోవర్తో హైదరాబాద్ మెట్రోలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని, నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
