ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏడాదికి రూ.6,000 పొందవచ్చు.ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదు కొనసాగుతుండగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన విడతల్లో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే 23వ విడతను జూలైలో విడుదల చేసే అవకాశం ఉంది. మే, జూన్ నెలల్లో దరఖాస్తు చేసుకున్న రైతులు ఈ విడత నుంచి ప్రయోజనం పొందే అవకాశముంది.
దరఖాస్తు విధానం:
రైతులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి రికార్డులు నమోదు చేసి అప్లై చేయాలి. అలాగే సమీప మీ-సేవా లేదా CSC కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
స్టేటస్ తెలుసుకోవడం:
దరఖాస్తు అనంతరం ‘Know Your Status’ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి తమ వివరాల స్థితిని తెలుసుకోవచ్చు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
