ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ డీలర్లకు క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు.రిటైల్ ఔట్లెట్లకు సరైన విధంగా సరఫరా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే అనుమతులపై పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిస్థితిపై నివేదికలు కాకుండా స్పష్టమైన ఫలితాలు కావాలని ఆయిల్ కంపెనీలకు స్పష్టం చేశారు.ఇక రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై పెట్రోల్ బంక్ అసోసియేషన్ నాయకులు స్పందిస్తూ, పెట్రోల్ కంటే డీజిల్ కొరత ఎక్కువగా ఉందన్నారు. గత వారం సరఫరా తగ్గడంతో సమస్య తలెత్తిందని తెలిపారు.ప్రభుత్వం జోక్యంతో త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రజలు అనవసరంగా భయపడి అధికంగా ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. పరిస్థితి త్వరలోనే సర్దుకుంటుందని అధికారులు తెలిపారు.
