ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్జెండర్కు తన వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) ఉద్యోగం కల్పించడం ద్వారా ఆమె సమానత్వానికి నిదర్శనంగా నిలిచారు. ప్రజల సమస్యలను తెలుసుకునే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్జెండర్ల బృందం ఎమ్మెల్యేను కలిసి ఇళ్ల పట్టాల కోసం విజ్ఞప్తి చేసింది. ఆ సందర్భంగా వారితో వచ్చిన వర్షిణి విద్యార్హతల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆమె బీకాం పూర్తి చేసినట్లు తెలిసి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.“చదువు ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకోవచ్చు కదా?” అని ప్రశ్నించిన ఎమ్మెల్యేకు, అవకాశాల లేమి వల్ల భిక్షాటన చేయాల్సి వస్తోందని వర్షిణి చెప్పింది. దీంతో వెంటనే ఆమెను పీఏగా నియమిస్తూ నెలకు రూ.25,000 జీతంతో అవకాశం కల్పించారు.ప్రస్తుతం వర్షిణి ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల సమన్వయం బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ నిర్ణయం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలపై కొత్త దారిని చూపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ చర్యపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఎమ్మెల్యే గళ్లా మాధవిని అభినందించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారుగతంలో కూడా ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తూ గళ్లా మాధవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా నిర్ణయంతో ఆమెకు ప్రజల నుంచి మరింత మద్దతు లభిస్తోంది.
