ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు కీలక సూచనలు చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పామాయిల్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.రఘునాథపాలెం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, రైతులకు శాస్త్రీయ వ్యవసాయం అవసరమని పేర్కొన్నారు. ఏ కాలంలో ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు అనుకూలం అనే విషయాల్లో శాస్త్రవేత్తలు గ్రామ స్థాయిలోనే రైతులకు మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు.పామాయిల్ పంట సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశముందని, దీనికి ప్రభుత్వం సబ్సిడీలు, రైతుబంధు వంటి పథకాల ద్వారా మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. అదేవిధంగా పామాయిల్ సాగుతో పాటు అంతర పంటలు వేసి అదనపు లాభాలు పొందవచ్చని సూచించారు.రఘునాథపాలెం మండలాన్ని రాష్ట్రంలో పామాయిల్ సాగులో అగ్రస్థానంలో నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. రైతులు ఆధునిక పద్ధతులు అనుసరిస్తే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని తెలిపారు.ఈ సందర్భంగా రైతులకు అవసరమైన యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అన్నదాతల సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
