ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విశాఖ అభివృద్ధిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పురోగతి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.విశాఖను ఐటీ, ఏఐ రంగాల్లో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 1.8 లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వివరించారు.గత ప్రభుత్వం పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుకబడిందని విమర్శించిన అనురాధ, ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.విశాఖలో చేపడుతున్న ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఎమ్మెల్సీ ఆశాభావం వ్యక్తం చేశారు.
