ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ ఆరోగ్యంగా ఉండటం తనకే మంచిదని, అప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడం సులభమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చెడు కోరుకోవడం తన స్వభావం కాదని తెలిపారు. గతంలో కేసీఆర్ గాయపడినప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పిన సీఎం, కేసీఆర్కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఉంటే తమకు అధికారం రాదనే భావన కుటుంబంలో ఉందని పేర్కొన్నారు.అలాగే కేసీఆర్ హయాంలోనే కల్వకుంట్ల తారక రామారావును సీఎం చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అధికార పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చాయని అన్నారు. అయితే చివరకు వారు అందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు.ఇప్పటికే కేసీఆర్ను రెండు సార్లు ఓడించానని, ఓటమి ఆయనకు కొత్త విషయం కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వివక్ష లేకుండా పనిచేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.
