ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత ఆటోమొబైల్ రంగ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని, స్వచ్ఛ ఇంధనాలైన ఎలక్ట్రిక్, హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.బవర్ల్డ్ ఇండియా కాంక్లేవ్లో మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన దిగుమతులు మరియు పర్యావరణ సమస్యలే ఈ మార్పుకు ప్రధాన కారణాలని తెలిపారు. భవిష్యత్తు పూర్తిగా పర్యావరణహిత ఇంధనాలదేనని ఆయన పేర్కొన్నారు. సిఎన్జి, ఎల్ఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.దేశంలో ఇప్పటికే పలు మార్గాల్లో హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులు ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయని తెలిపారు. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు ఈ రంగంలో పరిశోధనలు ప్రారంభించాయని చెప్పారు. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. వ్యవసాయ అవశేషాలతో ఇథనాల్ తయారీ ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని అన్నారు. ఇప్పటికే E20 ఇంధనం వినియోగంలోకి వచ్చిందని, భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణం అవుతాయని అభిప్రాయపడ్డారు.ప్రజా రవాణా భద్రతపై కూడా గడ్కరీ కీలక నిర్ణయాలు వెల్లడించారు. బస్సుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తూ, భౌతిక మరియు వీడియో ధృవీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. స్వీయ ధృవీకరణ విధానాన్ని రద్దు చేసి నాణ్యత, భద్రతను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ భారీగా పెరిగే అవకాశముందని, ప్రస్తుతం ఉన్న తయారీ సామర్థ్యం దానికి సరిపోకపోవచ్చని హెచ్చరించారు. దీంతో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
