ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సౌరశక్తి వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం అమలును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లను వచ్చే 100 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువును తప్పకుండా పాటించాలని సూచించారు.తాడేపల్లిలో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు పథకానికి సంబంధించిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అమలులో ఉన్న పురోగతి, సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టర్ల పనితీరు వంటి అంశాలను మంత్రి సమీక్షించారు. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల కనెక్షన్లు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. లక్ష్యాలను విభజించి, ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని చెప్పారు.సౌరశక్తి వినియోగం పెరగడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పారు.అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని, పనుల్లో నాణ్యతను కాపాడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
