ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతు సమస్యలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.పంటల కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు భారీగా వరి చేరుతున్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం రైతులను కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’ హామీలు అమలు కావడం లేదని, అవి బోగస్గా మారాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మాట మార్చిందని అన్నారు.ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట ప్రతి బస్తాకు ఒకటి, రెండు కిలోల వరకు తగ్గిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. గతంలో ఇలాంటి చర్యలపై కఠినంగా ఉంటామని చెప్పిన సీఎం, ఇప్పుడు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు.ఎండల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆయన విమర్శించారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు.ఎన్నికల హామీ ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.
