ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.వాట్సాప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’ ద్వారా ఇప్పటికే 1,035 సేవలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటివరకు 54 లక్షల మంది ప్రజలు 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వ సేవలు పూర్తిగా డిజిటల్ రూపంలోకి వస్తే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం పేర్కొన్నారు. పారదర్శకత, వేగవంతమైన సేవలందించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కర్నూలు జిల్లాలో అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టుపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగంపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. నేరాల నియంత్రణలో ఇవి కీలకంగా మారాయని, ప్రైవేట్ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు. శాటిలైట్ డేటాను ఆర్టీజీఎస్కు అనుసంధానించి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తిరుమల సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలకు ముందుగానే స్పందించే వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. మొత్తంగా డిజిటల్ గవర్నెన్స్ను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు సులభ సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
