ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉద్యోగాల అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్నికల మేనిఫెస్టోలో రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాన్ని మరిచిపోయారని ఆమె ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.గత ప్రభుత్వం ఇచ్చిన వయస్సు సడలింపును మరో రెండేళ్లు పొడిగిస్తూ జీవో నెం.30 జారీ చేసి, 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు వయో పరిమితిని పెంచిన విషయాన్ని కవిత ప్రస్తావించారు. అయితే ఆ గడువు ముగిసిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లో మళ్లీ 18 నుంచి 34 ఏళ్ల వయస్సు పరిమితి పెట్టడం అన్యాయమని విమర్శించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి వచ్చిన ఈ నోటిఫికేషన్ను “ఒక చేయితో ఇచ్చి మరో చేయితో లాగేసుకున్నట్లుంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనని తీవ్రంగా తప్పుబట్టారు.తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగుల జీవితాలను ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చకూడదని హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన 01/OG/PC/2026 నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేసి, ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 30 అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే నిరుద్యోగుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కవిత హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో ఉద్యోగాల అంశం మళ్లీ రాజకీయంగా హాట్టాపిక్గా మారింది.
