ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు, ఒక చిన్నారి, నలుగురు వీధి వ్యాపారులు ఉన్నారు.బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో భయాందోళనకు గురైన ప్రజలు రక్షణ కోసం గోడ కింద నిలుచుకోగా, అది అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి, ఘటనపై పూర్తి నివేదిక కోరారు.ప్రమాదానికి కూలిన గోడ వందేళ్లకు పైగా పాతదిగా గుర్తించారు. నిర్వహణ లోపాలు కారణమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. నగరంలోని పాత నిర్మాణాల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
