ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి (SSC) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈసారి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి పైచేయి సాధించగా, బాలురు 82.68%, బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫలితాలు మెరుగుపడి 78.39% ఉత్తీర్ణత నమోదైంది.ఈ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలు (ఎంజేపీ) గురుకులాలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. మొత్తం 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో రెండో స్థానం దక్కించుకున్నాయి.100 పాఠశాలల్లో 30 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదివే ఈ గురుకులాల్లో ఇలాంటి ఫలితాలు రావడం విద్యా రంగానికి మంచి సంకేతంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపారు. నరవాడ ఎంజేపీ పాఠశాల విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.ఈ ఫలితాలపై మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యా రంగంలో తీసుకుంటున్న చర్యల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
