ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మరో కీలక విజయాన్ని సాధించారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్స జరగడం విశేషంగా నిలిచింది.సుమారు 10 కిలోల బరువున్న చిన్నారికి తండ్రి లివర్లోని భాగాన్ని తీసుకుని మార్పిడి చేశారు. వైద్యుల సమన్వయం, నైపుణ్యంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.ఈ శస్త్రచికిత్స మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించడం మరో ముఖ్య అంశం. సాధారణంగా లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ తరహా చికిత్సను ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించడం పేద కుటుంబాలకు పెద్ద ఊరట కలిగిస్తోందిఈ విజయంపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందిస్తూ వైద్య బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ ఘటన నిరూపించిందన్నారు.వైద్యుల కృషి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సాధించిన ఈ విజయవంతమైన శస్త్రచికిత్స రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణంగా నిలుస్తోంది.
