ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరతపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయని, డీజిల్ కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆమె తెలిపారు. ఇది వ్యవసాయ పనులను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో పోరాడుతున్న రైతులకు ఇంధన కొరత మరింత భారమైందన్నారు.ప్రభుత్వం ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని షర్మిలా ఆరోపించారు. “రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకే ప్రాధాన్యమా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.రాష్ట్రంలో తలెత్తిన ఇంధన కొరత రవాణా, వ్యవసాయం వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ముందుగా రైతులకు, సామాన్య ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే, ప్రభుత్వం మాత్రం ఈ సమస్య తాత్కాలికమేనని, త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి వస్తుందని చెబుతోంది. అయినప్పటికీ ఈ అంశంపై రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి.
