మే 02, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ సోదరుడి కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ప్రమాదం అనంతరం మృతదేహాలను అంబులెన్స్లలో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబీకులను ఓదార్చుతూ వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒక మహిళ “మా వంశం మొత్తం చనిపోయింది” అంటూ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రమాదం మానవ తప్పిదమా, అతివేగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
