మే 02, (నేటి తెలుగు పత్రిక): బీసీ సంక్షేమం, అభివృద్ధి వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల నియమితులైన వి. హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ ప్రణాళికల అమలు వంటి అంశాలపై సమీక్ష జరిపినట్లు తెలిసింది.బీసీలకు విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
